Monday, September 21, 2015

నెల్లూరు జిల్లాలోని వాకాడు నవాబుపేట మద్యం సేవిస్తే గ్రామ బహిష్కరణ

మద్యం తాగరు.. తాగనివ్వరు- ఆదర్శ గ్రామం అదే..**
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
మద్యం ముట్టని గ్రామంగా పేరు గడించి రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచిన గ్రామం నవాబుపేట. నెల్లూరు జిల్లాలోని వాకాడు మండలం పూడిరాయదొరువు పంచాయతీ పరిధిలో ఉన్న నవాబుపేట సూళ్లూరుపేట సమీపంలోని సేంద్రసుకుప్పం ప్రాంతం నుంచి శ్రీహరికోట (షార్‌) ఏర్పాటుతో 40 ఏళ్ల క్రితం వలస వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు. 
~~~~~~~~~~~~~~~~
చేపల వేటే జీవనాధారం..**
~~~~~~~~~~~~~~~~
ఈ గ్రామంలో 70 ఇళ్లు, 350 మంది జనాభా ఉన్నారు. ఇక్కడంతా ముస్లిం కుటుంబాలే. సముద్రంలో చేపల వేటపై ఆధారపడే వీరు జీవిస్తుంటారు. చేపల వేట ద్వారా జీవనం సాగిస్తున్న వీరు .. మద్యం తాగే విషయంలో చాలా కట్టడిగా ఉంటారు. మనిషి పతనానికి మద్యం ప్రధాన వ్యసనమని భావిస్తారు.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
మద్యం సేవిస్తే జరిమానా, గ్రామ బహిష్కరణ..**
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
ఈ గ్రామంలో ఏ ఒక్కరూ మద్యం సేవించరు. కనీసం బీడీ, సిగిరెట్‌, పాన్‌పరాగ్‌ లాంటివి దరిచేరనివ్వరు. పొరుగు ప్రాంతానికి చెందిన వారు సైతం మద్యం సేవించి గ్రామంలోకి అడుగుపెట్టకూడదని కట్టుబాటు ఉంది. ఒక వేళ ఎవరైనా మద్యం సేవించి వస్తే వారికి రూ.500 జరిమాన విధిస్తారు. అదే గ్రామానికి చెందిన వారు ఎవరైనా మద్యం సేవిస్తే గ్రామ బహిష్కరణకు గురి కావాల్సిందే. ఈ గ్రామంలోకి ఇప్పటి వరకు పోలీసు కూడా అడుగు పెట్టలేదని గ్రామస్థులు తెలిపారు. గ్రామంలోని సమస్యలను గ్రామపెద్దలు, సర్పంచు సమక్షంలో పరిష్కరించుకుంటారు.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~


మరుగుదొడ్ల నిర్మాణంలోనూ ఆదర్శం..**
~~~~~~~~~~~~~~~~~~~~~~~~
70 గృహాలకు గాను 60 పక్కాగృహాలు నిర్మించుకున్నారు. ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి ఏర్పాటు చేసుకుని ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ గ్రామంలో ప్రతి ముస్లిం తప్పనిసరిగా రోజుకు ఐదుసార్లు నమాజ్‌ చేస్తారు. ప్రతి ఏడాదీ గ్రామానికి చెందిన 7 నుంచి 12 మంది యువకులు జమాత్‌ కోసం గ్రామం వదిలివెళతారు. వేరే ప్రాంతంలో ప్రార్థనలు జరుపుకుని ఏడాది అనంతరం తిరిగి గ్రామానికి తిరిగి వస్తారు. ఈ జమాత్‌లో ప్రతి ఒక్క ముస్లిం తప్పనిసరిగా పాల్గొనాలని నిబంధన.

0 comments:

Post a Comment